Connect with us

Literary

నెలనెలా తెలుగు వెన్నెల: మధురంగా టాంటెక్స్ 175వ సాహితీ సదస్సు

Published

on

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్ ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 20న జరిగిన 175 వ సాహితీ సదస్సు డాలస్, టెక్సస్ లో మధురంగా సాగింది. చిన్నారి భవ్య వినాయకుడి మీద ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ ని పరిచయం చేశారు. కొమరవోలు సరోజ తన ప్రసంగంలో ‘అందరినీ ఆకట్టుకునే కథా రచన – ఒక కథా రచయిత్రి మనోభావాలు’ అన్న అంశంపై చక్కగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వారి రచనలలో పేరు గడించిన ‘గాదిరి కోడలు’ కథను చెప్తూ అందరినీ నవ్వులతో ముంచెత్తారు.

శ్రీమతి కాశీనాథుని రాధ పద్య సౌగంథం శీర్షికన భాగవతంలో నుండి చక్కని పద్యాన్ని వినిపించారు. లెనిన్ వేముల మయూరుని శతకం గురించి వివరిస్తూ మాఘమాసం నాడు సూర్య భగవానుడి పై గల భక్తి ఆరాధన భావాలు వివరించారు. తరువాతి అంశంగా ‘మన తెలుగు సిరి సంపదలు’ ధారావాహిక లో భాగంగా ఊరిమిండి నరసింహారెడ్డి పొడుపు కథలు, జాతీయాలు, సంఖ్యా బోధక పదాలను సభ్యులకు గుర్తుచేశారు. మాసానికో మహనీయుడు శీర్షిక కింద శ్రీమతి అరుణ జ్యోతి ఈ నెలలో గుర్తు చేసుకోవలసిన ప్రముఖ రచయితల గురించి వివరించారు.

సమన్వయ కర్త కుప్పాచి శ్రీనివాసులు బసాబత్తిన ముఖ్య అతిధి జ్ఞాపిక చదివి వినిపించారు. టాంటెక్స్ అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ, ప్రార్థనా గీతం పాడిన భవ్య తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం మరియు పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి మధురంగా సాగిన ఈ సాహితీ సదస్సును ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected