Connect with us

Events

అంబరాన్నంటిన వాషింగ్టన్ తెలుగు సమితి ‘వాట్స్’ ఉగాది సంబరాలు

Published

on

వాషింగ్టన్ తెలుగు సమితి ఏప్రిల్ 9 శనివారం సాయంత్రం నిర్వహించిన శుభకృత్ నామ ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి.స్థానిక ఎవెరెట్ లోని సివిక్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ సంబరాలకు ఇండియా నుంచి విచ్చేసిన తారలు మరియు వాషింగ్టన్ నలుమూలల నుండి సుమారు 1400 మందికి పైగా వాషింగ్టన్ లోని తెలుగు వీక్షకులు, కళాకారులతో, సర్వాంగ సుందరంగా అలంకరిచిన ఆడిటోరియం కళ కళ లాడింది.

నూతనంగా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ అబ్బూరి నాయకత్వంలో కార్య నిర్వాహక సభ్యులు రెండు నెలలుగా ఎంతో శ్రమించి వినూత్నంగా రూపొందించిన ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు ఆరు గంటల పాటు దాదాపు 35 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా సాగాయి. 200 కి పైగా చిన్నారులు, పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక, చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, పాడిన గీతాలు అందరినీ అలరించి ప్రతి ఒక్కరి హృదయాలను చూరగొన్నాయి.

ఉగాది పండగ అంతా ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా తోరణాలు, బ్యానర్లు, పూదండలతో శోభాయమానంగా అలంకరించిన స్వాగత వేదిక వాషింగ్టన్ లోని తెలుగు ప్రేక్షకులని సాదరంగా ఆహ్వానించింది. సభ్యుల పరస్పర పలకరింపులతో, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, పిల్లల అల్లరి చేష్టలతో, నిర్దేశించిన సమయానికన్నా ముందే హాలు నిండిపోయింది.

వాషింగ్టన్ లో బోతెల్ వున్న తెలుగు పూజారి శ్రీ వాసుదేవ శర్మ గారు ఉగాది పంచాంగ శ్రవణం మరియు ఈ కొత్త సంవత్సర రాశి ఫలాలను అందరికీ విశదీకరించారు. వాషింగ్టన్ నలుమూలలు నుండి వచ్చిన చిన్నారుల అద్భుత ప్రదర్శనలతో ఆధ్యాంతం ఆకట్టుకున్నారు .అలాగే ఆర్కెస్ట్రా తో స్థానిక బృదం ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఇండియా నుండి విచ్చేసిన సినీ తారలు అదితి గౌతమ్ మరియు పూజ ఝవేరి డాన్సులతో వేదిక ప్రాంగణం హోరు మన్నది. కొస మెరుపుగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి సినీ తారలతో వేదిక మీదకు వచ్చి డాన్సులు చెయ్యడంతో స్టేజి ఈలలు చప్పట్లతో మార్మోగిపోయింది.

ఈ ఉగాది ఉత్సవాలలో ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాపేశ్వరం కాజా లాంటి పాతిక తెలుగు సాంప్రదాయ వంటకాలతోపాటు షడ్రుచుల ఉగాది పచ్చడి, అరిటాకు సహపంక్తి భోజనాలు వాషింగ్టన్ తెలుగు వారి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి మరియు కార్యకర్తలు సాంప్రదాయ తెలుగు పంచెకట్టుతో అందరికీ కొసరి కొసరి వడ్డించి మన అసలు సిసలు తెలుగు సాంప్రదాయ ఆతిధ్యాన్ని చవి చూపించడంతో తెలుగు సభ్యులు తాము స్వదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్నామన్న విషయం మరచేలా చేసింది.

చివరిగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వనితులకు మరియు ఇంతటి విజయవంతం కావటానికి సహకరించిన కార్య వర్గానికి, కార్య కర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి వినూత్నంగా స్పాన్సర్స్ కు మరియు ముఖ్యంగా తెలుగును ముందు తరాలకు తీసుకు వెళ్ళటం లో ముఖ్య భూమిక పోషిస్తున్న తెలుగు బడి అధ్యాపక బృందానికి శాలువాలతో సత్కరించారు. అనంతరం శ్రీనివాస్ అబ్బూరి అధ్యక్షులుగా తన ఈ సంవత్సర కార్యక్రమాన్ని వివరించారు. మన సంస్కృతీ, సంప్రదాయాల ఉద్దీపనకి, మన తెలుగు కమ్యునిటీ సంక్షేమానికి వాట్స్ చేస్తున్న కృషిని మరియు ఈ సంవత్సరం తాము నిర్వహించబోయే కార్యక్రమాలను వివరించి కార్యక్రమాన్నిముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected